Tuesday, August 13, 2013

ద ద ద


అనగా అనగా ప్రజాపతి గారు.  ఆయనకు దేవతలు మానవులు దానవులు అందరూ సంతానమే.

ఆయన సంతానమైన వారందరికీ బ్రహ్మ జ్ఞానం అంటే చాలా గొప్పదని ఒకసారి తెలిసింది.  దాంతో వారు తమ తండ్రిని ఆశ్రయించి అదేమిటో తెలుసుకొనాలని ఉబలాట పడ్డారు.  వారి ఉబలాటం కేవలం తెలుసుకొనడం కోసం మాత్రమే కాదు.  దానిని పాటించి తీరాలనే ఉత్సాహం కూడా వారిలో ఉరకలు వేసింది.       

వారు అందరూ తమ తండ్రి చెంతకు చేరి బ్రహ్మ జ్ఞానం తమకు ప్రసాదించమని అడిగారు.  అది అందరికీ చెప్పేందుకు వీలు లేదు.  మీరందరూ ముందుగా బ్రహ్మచర్యం పాటించండి ఆనక చూద్దాం అని ప్రజాపతి గారు చెప్పారు.  తన సంతానమే కదా అని జాలి పడి అర్హత లేకున్నా పట్టాభిషేకం చేసే మన రాజకీయనాయకుల బాపతు కాదు ఆయన.                      

దాంతో వారందరూ బ్రహ్మచర్యం పాటిస్తూ గొప్ప తపస్సు చేసి అర్హత సంపాదించారు.  

01)
తరువాత దేవతలు మిగిలినవారి కంటే ముందుగానే ప్రజాపతి చెంతకు వచ్చి తమకు ఉపదేశం చేయమని కోరారు.  ప్రజాపతి సంతోషించి వారికి "ద" అనే ఒకే ఒక అక్షరాన్ని ఉపదేశించాడు.  
"నా ఉపదేశం మీకు అర్థమైందా?" అని వారిని అడిగాడు.  "
ఓ! బ్రహ్మాండంగా అర్థమైంది"  అని వారు బదులు చెప్పారు.  
"ఏమి అర్థమైంది?" అని ప్రజాపతి మరలా వారిని అడిగాడు.  
"ద" అనే అక్షరంతో మీరు మాకు "దమం" కలిగి ఉండండి అని ఉపదేశించారు" అని దేవతలు చెప్పారు.  
అది విని ప్రజాపతి సంతోషించాడు. 
"చక్కగా అర్థం చేసుకున్నారు" అని వారిని మెచ్చుకున్నాడు.  
దేవతలు ఆనందపడి ఆ ఉపదేశాన్ని పాటిస్తాం అని వెళ్లిపోయారు. 
(దమం అంటే ఐదు జ్ఞానేంద్రియాల మీద ఐదు కర్మేంద్రియాల మీద అదుపు సాధించడం.)
పంచేంద్రియాలు గుఱ్ఱాల వంటివి.  వాటిని అదుపు చేయగలిగామా , రథం వంటి దేహం చక్కగా పని చేస్తుంది.   వాటిని అదుపు చేయలేక పోయామా, రథం బోల్తా కొట్టినట్టే మన దేహయాత్ర కూడా బోల్తా కొడుతుంది.  అనారోగ్యాలతో తీసుకుని చావవలసిందే మరి.   


02)
తరువాత మానవులు ప్రజాపతి చెంతకు వచ్చి తమకు ఉపదేశం చేయమని కోరారు.  
ప్రజాపతి సంతోషించి వారికి "ద"  అనే ఒకే ఒక అక్షరాన్ని ఉపదేశించాడు.  
"నా ఉపదేశం మీకు అర్థమైందా?" అని వారిని అడిగాడు. 
 "ఓ! బ్రహ్మాండంగా అర్థమైంది"  అని వారు బదులు చెప్పారు.  
"ఏమి అర్థమైంది?" అని ప్రజాపతి మరలా వారిని అడిగాడు. 
"ద" అనే అక్షరంతో మీరు మాకు "దానగుణం" కలిగి ఉండండి అని ఉపదేశించారు" అని మానవులు చెప్పారు.  
అది విని ప్రజాపతి సంతోషించాడు. 
"చక్కగా అర్థం చేసుకున్నారు" అని వారిని మెచ్చుకున్నాడు.  
మానవులు ఆనందపడి ఆ ఉపదేశాన్ని పాటిస్తాం అని వెళ్లిపోయారు.
ఈ ఆధునిక మానవులు గోదానం భూదానం అంటే నమ్మకం లేదంటారు.  సరే కానివ్వండి .  మరి కనీసం రక్తదానం నేత్రదానం లాంటివి కూడా పుణ్యప్రదాలే.  మరి కనీసం వాటినైనా చేయాలి.   నడుం బిగించి ప్రచారం కూడా చేయాలి.       


03)
కాసేపైన తరువాత దానవులు ప్రజాపతి చెంతకు వచ్చి తమకు ఉపదేశం చేయమని కోరారు.  
ప్రజాపతి సంతోషించి వారికి "ద"  అనే ఒకే ఒక అక్షరాన్ని ఉపదేశించాడు.  
"నా ఉపదేశం మీకు అర్థమైందా?" అని వారిని అడిగాడు. 
"ఓ! బ్రహ్మాండంగా అర్థమైంది"  అని వారు బదులు చెప్పారు.  
"ఏమి అర్థమైంది?" అని ప్రజాపతి మరలా వారిని అడిగాడు.  
"ద" అనే అక్షరంతో మీరు మాకు "దయాగుణం" కలిగి ఉండండి అని ఉపదేశించారు" అని దానవులు చెప్పారు. 
 అది విని ప్రజాపతి సంతోషించాడు. 
"చక్కగా అర్థం చేసుకున్నారు" అని వారిని మెచ్చుకున్నాడు.  
దానవులు  ఆనందపడి ఆ ఉపదేశాన్ని పాటిస్తాం అని వెళ్లిపోయారు.
అధమశ్రేణి జంతువులకే దయ ఉన్నపుడు ఉన్నతశ్రేణికి చెందిన ప్రాణి అయిన మానవుడికి దయ ఎందుకు ఉండదు?  

ఇదే ఉపదేశాన్ని మేఘాలు కూడా ఉరుముతూ వినిపిస్తూ ఉంటాయి.  ఆ మేఘాలు "ద ద ద" అని ఉరిమినప్పుడల్లా మనం "ఓహో,  ఇది ప్రజాపతి తన సంతానానికి చేసిన ఉపదేశం కదా" అని మనం గుర్తుతెచ్చుకోవాలి.  కేవలం గుర్తు తెచ్చుకుంటే చాలదు.  ఆ ఉపదేశాలను వారు ఎంత కష్టపడితే సాధించారో!  వాటిని నిత్యం స్మరిస్తూ వాటిని (దమాన్ని, దానగుణాన్ని దయాగుణాన్ని) ఆచరించేందుకు సంకల్పించి సఫలురం కావాలి.

(ఈ కథ బృహదారణ్యక ఉపనిషత్తు లోనిది.  ఇటువంటి ప్రబోధాత్మకమైన కథలు మన ఉపనిషత్తులలో కొల్లలు కొల్లలు.  వీటిని సంస్కృత అధ్యాపకులు చదవాలి లోకానికి అందజేయాలి.  లేకుంటే సంస్కృతం చదివినవారికి చదవనివారికి పెద్ద తేడా ఏముంటుంది?)  


గుంటూరులో రాష్ట్రస్థాయిలో జరుగవలసిన సంస్కృత అధ్యాపకుల సమావేశం ఆంధ్రప్రదేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది.  ఈ అసౌకర్యానికి క్షంతవ్యులం, అదే విధంగా మీ సౌహార్దతకు వినమ్రులం అని విన్నవించుకుంటున్నాము.  ధన్యవాదాలు.