Thursday, March 29, 2012

సంస్కృత డాక్టరేట్ లకు శ్రీ వర్మ గారి సత్కారం

              విశాఖపట్నం స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో సంస్కృత సోదరులందరి ఎదుట డాక్టరేట్ సాధించిన సంస్కృత మిత్రులను సన్మానించాలని సంస్థ కోశాధికారి అయిన శ్రీ వర్మ గారు నిశ్చయించుకుని, సంస్థ అధ్యక్షులు అయిన శ్రీ పెద్దిరాజు గారికి ఈ విషయం తెలిపారు.  మార్చ్ నెల 29 వ తేదీన ఆంధ్రప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం ఆధ్వర్యవంలో, ఆర్.ఐ.ఓ. గారి అనుమతితో సభ జరిగింది.


           శ్రీ మూడడ్ల ఉమామహేశ్వర రావు గారి ప్రార్థనతో సభ మొదలైంది.

మొదట సంఘ అధ్యక్షులు శ్రీ పెన్మెత్స పెద్దిరాజు గారు మాటలాడుతూ హైస్కూల్ స్థాయిలో సంస్కృతాన్ని ఒక అధ్యయన విషయంగా ప్రవేశపెట్టవలసిందిగా సంఘం వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, అందుకు ప్రభుత్వ విద్యారంగం అధికారులు అనుకూలంగా స్పందించి, ఒక్క విశాఖపట్నం జిల్లా లోనే 300 టీచర్ పోస్ట్ లను ఇవ్వగలమని చెప్పారన్నారు.
సంఘ సభ్యులందరూ అందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా పెద్ది రాజు గారు మాత్రం మరి ఈ 300  పోస్ట్ లు వస్తే, వాటినన్నింటిని మనం భర్తీ చేయగలిగిన సంఖ్యలో ఉన్నామా అని మనం ఆత్మ విమర్శ చేసుకొనవలసి ఉంది అని హెచ్చరించారు.  సంస్కృతం చదువుకున్న వారికి సరైన జీవిక లేదనే విచారాన్ని ప్రక్కకు తోసి సంస్కృతం చదివే వారిని ప్రోత్సహించాలని హితవు పలికారు.  
  
పిమ్మట సంఘ గౌరవాధ్యక్షులు శ్రీ పిళ్ళా రమణమూర్తి గారు మాటలాడుతూ, ఈ సంవత్సరం ఆగస్ట్ నెల 19 వ తేదీన విశాఖపట్నం సంస్కృత అధ్యాపక సంఘం వారు రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని సంఘసభ్యుల హర్షామోదాల కరతాళధ్వనుల నడుమ ప్రకటించారు.
ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను వివిధ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సభ్యులందరూ తదేక దీక్షతో మహోత్సాహంతో వీటిలో భాగస్వామ్యం వహించాలని కోరారు.  కార్యక్రమనిర్వహణకు నిధులు అవసరమని, నగరంలోని కొందరు వదాన్యులైన దాతలు అందుకు అంగీకరించారని, అయినా, సంఘసభ్యులమైన మనం కూడా తలొక చేయి వేయవలసినదే అని, ఆయన కోరారు.

పిమ్మట సంఘ ఉపాధ్యక్షులైన శ్రీ మూడడ్ల ఉమా మహేశ్వర రావు గారు మాటాడుతూ గత సంవత్సరం నుండి ఇంత వరకు సంఘం చేపట్టిన కార్యక్రమాలను వివరించి, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, సమయం మించి పోక మునుపే సంఘం దృష్టికి తీసుకురమ్మని,  సంఘ కార్యవర్గ సభ్యులందరూ ఆ సమస్యను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారని అందరి కరతాళ ధ్వనుల నడుమ దృఢమ్ గా ప్రకటించారు. 

పిమ్మట డాక్టరేట్ సాధించిన సంఘ సభ్యులకు సత్కారం జరిగింది.  సభలో ఆద్యంతం మౌనంగా చిరునవ్వుతో వేదికపై కూర్చున్న శ్రీ వర్మ గారి వదాన్యత ఈ సత్కారానికి మూల కారణం.  

ఈ సత్కారాన్ని అందుకున్న వారు వరుసగా...


01 ) శ్రీ పోలా ఉమా మహేశ్వర రావు గారు.  శ్రీ చైతన్య కళాశాలలో అధ్యాపకులు.  2005 వ సంవత్సరంలోనే ఆంధ్రవిశ్వవిద్యాలయంలో శ్రీ వేంకటేశ్వర రావు గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ సాధించారు.  వారి అధ్యయన విషయం "శ్రీమద్భాగవతే పురుషార్థ దృష్ట్యా సుభాషిత విచారః."  


02) శ్రీమతి  చంద్రిక గారు.  2008 వ సంవత్సరంలో నాగార్జున విశ్వ విద్యాలయంలో శ్రీ సత్యనారాయణ రావు గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ సాధించారు.  వారి అధ్యయన విషయం "భాసనాటకేషు అలంకార పరిపోషణం"  


03) శ్రీమతి  రాజ్యలక్ష్మి గారు.  2010 వ సంవత్సరంలో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఎం.వి. రమణ గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ సాధించారు.  వారి అధ్యయన విషయం "ఆంధ్రదేశీయానాం సంస్కృతవ్యాఖ్యాసాహిత్యం - ఏకం అధ్యయనం". 


04) శ్రీ పాటీలు శ్రీనివాస కృష్ణ గారుశ్రీ చైతన్య కళాశాలలో అధ్యాపకులు.  2011 వ సంవత్సరంలో (1- 11 - 11 తేదీ)  తిరుపతి నగరంలోని కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం ఐన రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం లో డాక్టర్ రాణి సదాశివ మూర్తి గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ సాధించారు.  వారి అధ్యయన విషయం "శ్రీమద్రామాయణే లోకవృత్తస్య అధ్యయనం".

సత్కార గ్రహీతలందరూ సంక్షిప్తంగా తమను తాము పరిచయం చేసుకొని తమ విజయానికి మూలకారకులైన వారిని స్మరించి, తమకు జరిగిన సత్కారానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి  ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి సత్కారాన్ని తమ చేతుల మీదుగా జరిపించిన అసిస్టంట్ కేంప్ ఆఫీసర్లు శ్రీ  మల్లికార్జున రావు గారికి మరియు శ్రీ భాస్కర రావు గారికి సంఘ సభ్యులు తమ కృతజ్ఞతలను తెలిపారు.


ఈనాడు వీరికి జరిగిన సత్కారం మరింత మంది సంస్కృత సోదర సోదరీమణులు విద్యారంగంలో ముందు ముందు ఇటువంటి ఘనతలు సాధించేందుకు ప్రేరణ కావాలని శ్రీ వర్మ గారు ఆకాంక్షించారు.
  
 శ్రీ మన్మథ రావు గారి వందన సమర్పణతో సభ ముగిసింది.

Wednesday, March 28, 2012

అక్షౌహిణి

మహాభారతంలో పాండవుల సైన్యం ఏడు అక్షౌహిణులు,   కౌరవుల సైన్యం పదకొండు అక్షౌహిణులు మొత్తం పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం పాల్గొంది అని అంటారు కదా! 
రథయోధులు
 అసలు అక్షౌహిణి అంటే ఎంత సైన్యం?  అది చూద్దాం.
గజయోధులు

పై శ్లోకాన్ని నెమ్మదిగా లెక్కలలోనికి మారుద్దాం.
అశ్వయోధులు
దీన్ని బట్టి, ఒక అక్షౌహిణి సైన్యంలో -
21870  ఏనుగులు, 21870  రథాలు, 65610 గుఱ్ఱాలు, 109350  మంది కాల్బలము ఉంటాయన్నమాట!!!!

ఆధునిక భారతీయ కాల్బలము




 

Friday, March 23, 2012

సంస్కృత అధ్యాపక సంఘం వారి రూపక ప్రదర్శన - "ఖగోళ భువన విజయం"

ఆంధ్రప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం, విశాఖపట్నం శాఖ వారు  23 /03 /2012  నాడు శ్రీనందన నామ సంవత్సర యుగాది సందర్భంగా విశాఖ నగరంలోని మురళీనగర్ కాలనీ లోని వైశాఖి క్రీడోద్యానం లోని విశాల ప్రాంగణంలో పంచాంగశ్రవణ  కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే, ఈ కార్యక్రమాన్ని"ఖగోళ భువన విజయం" అనే పేరిట ఒక రూపకంగా ప్రదర్శించడం జరిగింది.  ఈ ప్రయోగం క్రొత్తదని అద్భుతంగా ఉందని పలువురు ప్రేక్షకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  కాని, ఈవిధమైన కార్యక్రమానికి ఆద్యులు కీర్తి శేషులైన ఆచార్యశ్రీ దివాకర్ల రామ మూర్తి గారు.  వారి ఆధ్వర్యవంలో,  శ్రీ దూర్వాసుల భాస్కరమూర్తి గారి నిర్వహణా దక్షతలో విశాఖపట్నంలోని  శ్రీ కృష్ణాశ్రమంలో, అప్పుడప్పుడు ద్వారకా నగర్ లోని శంకరమఠంలోను, క్వాచిత్కంగా సింహాచల స్వామివారి సమక్షంలోను కూడా పండిత పరిషత్ప్రమోదదాయకంగా నలభై సంవత్సరాలు అవిచ్చిన్నంగా ఈ కార్యక్రమం జరిగిన విషయం నగరంలోని రసజ్ఞులెందరికో తెలిసిన విషయమే.  ఆ కార్యక్రమంలో శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు, శ్రీ వసంతరావు వేంకటరావు గారు, శ్రీ పాటీలు తిమ్మారెడ్డి గారు, శ్రీ బంగారేశ్వరశర్మ గారు, శ్రీ కృష్ణమాచార్యులు గారు, కొండేపూడి వేంకట సుబ్బారావు గారు,  మొదలైన మహామహులు ఎందరో పాల్గొని దీని ప్రఖ్యాతికి మూల కారకులయ్యారు.
కాని, దాదాపు 2006  వ సంవత్సరం నుండి ఈ కార్యక్రమం అనివార్య కారణాలవలన నిలిచిపోయింది.  కేవలం నిలిచి పోయింది.  ఆగిపోలేదు.  ఆ తరువాత 2008 వ సంవత్సరంలో శ్రీచైతన్య కళాశాల సంస్కృత అధ్యాపకులు వారి కళాశాలలో ఈ కార్యక్రమం ప్రదర్శించి తమ సహాధ్యాపకుల  మెప్పు పొందారు.  ఆ ధైర్యంతో 2012  ఉగాది నాడు మరలా విశాఖ ప్రజల ముందుకు ఆత్మ విశ్వాసంతో రావడం జరిగింది.  
దివికేగిన మహామహులు శ్రీ దివాకర్ల రామమూర్తి గారు, శ్రీ వసంత రావు వేంకట రావు గారు, శ్రీ పాటీలు తిమ్మారెడ్డి గారు తమ ఆశీస్సులను అక్కడి నుండి నేటి యువతరం ప్రదర్శకులకు అందించి ఉంటారనేందుకు ఏమాత్రం సందేహం లేదు.
వైశాఖి క్రీడోద్యాన సంఘం అధ్యక్షులైన
శ్రీ రామకృష్ణా రెడ్డి గారు ఈ కార్యక్రమం తమ ప్రాంగణంలో జరిపించేందుకు మంచి పట్టుదల చూపించారు. 
శ్రీ నందన నామ సంవత్సర ఖగోళ భువన విజయం అనే రూపకాన్ని
శ్రీ చైతన్య విద్యాసంస్థలలో సంస్కృత అధ్యాపకులుగా పని చేస్తున్న శ్రీనివాసకృష్ణ గారు రూపు దిద్దారు.  ప్రదర్శనలో వారు కాలజ్ఞులుగా వ్యవహరించారు.భారతీయవిద్యాకేంద్ర 
కళాశాలలో సంస్కృత విభాగ అధ్యక్షులుగా ఉన్న శ్రీ పిళ్లా రమణ మూర్తి గారు ఈ ప్రదర్శనలో సూర్యునిగా,  శ్రీ చైతన్య విద్యాసంస్థలలో అధ్యాపకులైన శ్రీ కేదారి శెట్టి ఆదినారాయణ గారు చంద్రునిగా, శ్రీ ఖాదర్ వలీ గారు కుజునిగా, శ్రీ బొత్సా తిరుపతి రావు గారు బుధునిగా,  శ్రీ శేషుబాబు గారు గురునిగా వ్యవహరించారు.  ఎన్నారై కళాశాలలో సంస్కృత అధ్యాపకులైన శ్రీ మంగిపూడి కామేశ్వర రావు గారు శుక్రునిగా, శ్రీ త్రినాథం గారు శనైశ్చరునిగా వ్యవహరించారు.
నిర్వాహకులైన వైశాఖి క్రీదోద్యాన సంఘ సభ్యులతో రూపక ప్రదర్శక బృందం 

శ్రీ రామకృష్ణారెడ్డి గారు తమ వైశాఖి క్రీడోద్యాన సంఘం తరపున సంస్కృత అధ్యాపకులందరినీ జ్ఞాపిక తోను, కండువాతోను సత్కరించడం మాత్రమే కాక, నాలుగువేల రూపాయలను పారితోషికంగా సమర్పించారు.  
ఆ విధంగా ఆంధ్ర ప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘం, విశాఖపట్టణం వారు ప్రజల సమక్షంలో చేసిన తొలి ప్రదర్శన అత్యంత విజయవంతంగా ముగిసింది.తరువాత ఖగోళ భువన విజయ రూపక ప్రదర్శక బృందం సభ్యులందరూ తమకు వచ్చిన పారితోషికాన్ని ఆంధ్ర ప్రదేశ సంస్కృత అధ్యాపక సంఘానికి విరాళంగా సమర్పిస్తూ, స్పాట్ వాల్యుయేషన్ లో పని చేస్తున్న ఇతర సంఘ సభ్యులందరి సమక్షంలో, సంఘ అధ్యక్షులైన శ్రీ పెద్దిరాజు గారి చేతికి అందించారు. 
సంఘ అధ్యక్షులైన పెద్దిరాజు గారికి తమ పారితోషికాన్ని అందిస్తున్న రూపక ప్రదర్శనకారులు.  చిత్రంలో వరుసగా.. ౧) శ్రీ కామేశ్వర రావు గారు, ౨) శ్రీ తిరుపతి రావు గారు, ౩) శ్రీ శ్రీనివాస కృష్ణ గారు, ౪) శ్రీ పెద్ది రాజు గారు, ౫) శ్రీ త్రినాధ్ గారు, ౬) శ్రీ ఖాదర్ వలీ గారు,  ౭) శ్రీ పిళ్లా రమణ మూర్తి గారు.   (శ్రీ ఆదినారాయణ గారు, శ్రీ శేషుబాబు గారు చిత్రంలో లేరు.)
శ్రీ పెద్దిరాజు గారు సంస్కృత అధ్యాపక సంఘానికి సహాయ కోశాధికారి అయిన శ్రీ గౌరీనాయుడు గారికి ఆ ధనం అందజేసి ఇటువంటి కష్టార్జితమైన ధనమే సంఘానికి శ్రీరామరక్షగా నిలుస్తుందని అన్నారు.  సంస్కృత అధ్యాపక సంఘం,వారు ఇకపై నుండి ఇటువంటి కార్యక్రమాలను ఇతోధికంగా చేస్తూ ప్రజల మెప్పును ఆదరాభిమానాలను పొందవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.  కార్యక్రమాన్ని ఆద్యంతం,తిలకించి పులకించి పోయానని వారు చెప్పారు.
సంఘ సభ్యులు అందరూ ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు ఎంతో సంతోషించారు. 
రూపక ప్రదర్శక బృందాన్ని అభినందించారు.

                     (((((((((((((((((((((((((మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి.)))))))))))))))))))))))))
                                        Email: apsla.visakha@gmail.com

Saturday, March 17, 2012

విద్యను గూర్చిన ప్రశంసాశ్లోకాలు కొన్ని...

మహా మాత్రే సరస్వత్యై నమో నమః
విద్యాప్రశంస

౦౧) అపూర్వః కోపి కోశోయం విద్యతే తవ భారతి.
       వ్యయతో వృద్ధిమాయాతి క్షయమాయాతి సంచయాత్..
భావము :  ఓ సరస్వతీదేవీ, నీ చెంత ఉన్నటువంటి నిధి చాల అపూర్వమైనది.  అదేమిటో, విచిత్రం, ఖర్చు పెడుతూ ఉంటే పెరుగుతుంది.  దాచుకుంటే తరుగుతుంది.  (ఆ నిధి పేరే విద్య) 

౦౨) అనేక సంశయోచ్చేది పరోక్షార్థస్య దర్శకం.
       సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్త్యంధ ఏవ సః..
భావము :  శాస్త్రము అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది.  పరోక్షమైన దానిని (మోక్షాన్ని) దర్శింపజేస్తుంది.  ఈ విధంగా శాస్త్రవిద్య ప్రతి ఒక్కరికి నేత్రం వంటిది.  అది లేని వాడు గ్రుడ్డివాడి క్రింద లెక్క.
 
౦౩) సర్వద్రవ్యేషు విద్యైవ ద్రవ్యమాహురనుత్తమం.
      అహార్యత్వాత్ అనర్ఘ్యత్వాత్ అక్షయత్వాత్ చ సర్వదా..
భావము :  అన్ని పదార్థాలలోనూ విద్య అనేది అతి ఉత్తమమైన పదార్థం అని చెప్పబడింది.  ఎందుకంటే అది దొంగిలింపబడదు.  అది విలువ కట్టబడదు.  అది తరిగిపోదు.    


౦౪) హర్తుర్న గోచరం యాతి దత్తా భవతి విస్తృతా.
       కల్పాన్తేపి న వా నశ్యేత్ కిమన్యత్ విద్యయా సమం..
భావము :  విద్య కంటికి కనబడదు.  దానం చేస్తే విస్తారంగా పెరుగుతుంది.  కల్పాంతంలో కూడా నశించేది కాదు.   అందువలన విద్యతో సమానమైనది ఏమున్నది?  (ఏదీ విద్యకు సమానం కాదని అర్థం)
 

౦౫) జ్ఞాతిభిర్న విభజ్యతే నైవ చోరేణాపి న నీయతే.
        దానే నైవ క్షయం యాతి విద్యారత్నం మహద్ధనం..
భావము :  విద్యను జ్ఞాతులు పంచుకొనలేరు.  దొంగలు దీనిని ఎత్తుకొని పోలేరు.  దానం చేసినా ఇది తరగదు.  విద్య అనే రత్నం అతి గొప్పదైన ధనం.


౦౬) విద్యా శస్త్రం చ శాస్త్రం చ ద్వే విద్యే ప్రతిపత్తయే.
       ఆద్యా హాస్యాయ వృద్ధత్వే ద్వితీయాద్రియతే సదా..
జయేంద్రసరస్వతి యతివర్యులతో విజయేంద్రసరస్వతులు

భావము :  శస్త్రవిద్య శాస్త్రవిద్య అని విద్య రెండు విధాలు.  ముసలితనంలో మొదటి విద్య నవ్వులపాలు అవుతుంది.  (ముసలివీరులను ఓడించగల యువవీరులు ఉంటారు.)  రెండవ విద్య ఎల్లప్పుడూ గౌరవింపబడుతుంది. (వృద్ధాప్యం వస్తున్నకొద్దీ శాస్త్ర పండితుడు మరింత మంది యువపండితులకు ఆరాధ్యుడైన గురువుగా మారుతాడు.)






౦౭) శునః పుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా వినా. 
       న గుహ్యగోపనే శక్తం న చ దంశనివారణే..
నా తోకను మనిషి బ్రతుకుతో పోల్చినందుకు చాలా సంతోషం.. 
భావము :  కుక్కకు ఒక తోక ఉంటుంది కాని ఆ తోక దాని రహస్యాన్ని(మల విసర్జక అంగాన్ని) దాచలేదు.  పోనీ దోమలను తోలేందుకు ఉపయోగ పడుతుందా అంటే - అదీ లేదు.  అలాగే, విద్య లేని మనిషి బ్రతుకు కుక్క తోకతో సమానమాట.  (కుక్కకు తోక ఎందుకూ పనికిరాదు.  అదే విధంగా, విద్య లేని మనిషికి అతని బ్రతుకు కూడా ఇహానికి పరానికి దేనికీ పనికి రాదు అని అర్థం.) 

 
౦౯) సద్విద్యా యది కా చింతా వరాకోదరపూరణే.
       శుకోప్యశనమాప్నోతి రామ రామేతి చ బ్రువన్..

భావము :  మనిషికి చక్కని విద్య ఉన్న పక్షంలో; తనకు ఉన్న జానెడు పొట్టను ఎలా నింపుకొనడమా  అనే దిగులు అవసరం లేదు.  చివరకు చిలుక కూడా "రామ" అనే ఒకే ఒక్క పదాన్ని నేర్చుకుని దానిని వల్లె వేస్తుంటే ముచ్చట పడి దాని యజమాని దాని పొట్ట నిండుగా ఆహారం పెడుతున్నాడు కదా. 
 





౧౦) వసుమతీపతినా ను సరస్వతీ 
       బలవతా రిపుణాపి న నీయతే.
       సమవిభాగహరైర్న విభజ్యతే 
       విబుధబోధబుధైరపి సేవ్యతే..
 భావము :  సరస్వతిని  (విద్యను) భూపతి అయిన రాజు లాగుకొనలేడు బలవంతుడైన శత్రువు కూడా లాగుకొనలేడు.  ప్రతి దాంట్లోనూ భాగం పంచుకొనే జ్ఞాతులు కూడా ఈ విద్యను పంచుకొనలేరు.  మహా పండితులు కూడా ఈ విద్యను ఆదరిస్తారు.  (కాబట్టి అటువంటి విద్యను సంపాదించుకోవాలి.)  

౧౧) శ్రియః ప్రదుగ్ధే విపదో రుణద్ధి.
       యశాంసి సూతే మలినం ప్రమార్ష్టి.
       సంస్కారశౌచేన పరం పునీతే 
       శుద్దా హి విద్యా కిల కామధేనుః.. 
కామధేనువు
భావము :  (కామధేనువు పాలను ప్రసాదించే విధంగా...) విద్య   సంపదలను ప్రసాదిస్తుంది.  (కామధేనువు అశుభాలను తొలగించే విధంగా...) విద్య ఆపదలను తొలగిస్తుంది.  (కామధేనువు వత్సాన్ని ప్రసవించే విధంగా...) విద్య కీర్తిని ప్రసవిస్తుంది (కలిగిస్తుంది).  (కామధేనువు తాను నివసించే గృహపరిసరాల మాలిన్యాన్ని దూరం చేసేవిధంగా...) విద్య తనను అభ్యసించే మనిషి యొక్క మనోమాలిన్యాలను చెరిపివేస్తుంది.  కామధేనువు వలెనే  విద్య కూడా పరిశుద్ధమైన సంస్కారాలను కలిగించి ఎంతో పవిత్రతను కలుగజేస్తుంది.  (పరలోకానికి = మోక్షానికి చేరువ చేస్తుంది.)  ఇటువంటి పరిశుద్ధమైన విద్య సాక్షాత్తు కామధేనువే కదా!

౧౨) న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ భారకారి.
        వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధనప్రధానం.. 
(నేడు ప్రజలు చదువు "కొంటున్నారు", ఎందుకంటే - అది మంచి పెట్టుబడి అని అందరూ భావిస్తున్నారు కాబట్టి.)
భావము :  విద్య దొంగల చేత దొంగిలింపబడదు.  రాజులు విద్యపై పన్ను వసూలు చేయలేరు.  అన్నదమ్ములు దీనిని పంచుకొనలేరు.  విద్య ఎన్నడూ భారం కాదు.  ఖర్చు పెడుతుంటే విద్య పెరుగుతుంది.  అందువలన అన్ని ధనాలలోనూ విద్య అనే ధనమే ప్రధానమైనది.  

 
౧౩) మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే
       కాన్తేవ చాభిరమయత్యపనీయ ఖేదం.
       లక్ష్మీం తనోతి వితనోతి చ దిక్షు కీర్తిం
      కిం కిం న సాధయతి కల్పలతేవ విద్యా??
కల్ప వృక్షం - ఒక చిత్రకారుని ఊహాచిత్రం 

భావము :  విద్య తల్లి వలె రక్షిస్తుంది.  తండ్రి వలె మంచి దారిలో నడిపిస్తుంది.  జీవిత భాగస్వామి వలె విచారాన్ని తొలగించి వినోదపరుస్తుంది.  సంపదలను కలిగిస్తుంది.  అన్ని దిక్కులలోనూ కీర్తిని వ్యాపిమ్పజేస్తుంది.  ఈ విధంగా కల్పవృక్షం వంటి విద్య సాధించలేనిది ఏమున్నది?  (విద్యావంతుడు దేనినైనా సాధించగలడు అని అర్థం.)



౧౪) విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్చన్నగుప్తం ధనం
        విద్యా భోగకరీ యశః సుఖకరీ విద్యా గురూణాం గురుః. 
        విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరా దేవతా
        విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యావిహీనః పశుః..

 భావము :  విద్య మనిషికి అధికమైన తేజస్సును కలిగిస్తుంది.  విద్య ఒక రహస్యమైన నిధితో సమానం.  విద్య భోగాలను ప్రసాదిస్తుంది.  కీర్తిని, సుఖాన్ని కలిగిస్తుంది.  ఈ విద్య గురువులకే గురువు.  విదేశాలలో మనలను ఆదుకొనే బంధువు విద్యయే.  ఈ విద్య అతి గొప్ప దేవత.  ఈ విద్యను రాజులు కూడా గౌరవిస్తారు.  ఇటువంటి విద్య లేనివాడు పశువుతో సమానం.  (విద్యలేని మనిషికి, ఒక జంతువుకు పెద్ద తేడా ఉండదు)
గాడిదంటేనే మనిషికి లోకువ...
కాని, చదువుకోని మనిషంటే గాడిదకు కూడా లోకువే...


౧౫) విద్యా నామ నరస్య కీర్తిరతులా భాగ్యక్షయే చాశ్రయో
       ధేనుః కామదుఘా రతిశ్చ విరహే నేత్రం తృతీయం చ సా.
       సత్కారాయతనం కులస్య మహిమా రత్నైర్వినా భూషణం
       తస్మాదన్యముపేక్ష్య సర్వవిషయం విద్యాధికారం కురు..
భావము :  విద్య మనిషికి సాటిలేని ఒక కీర్తి.  మిగిలిన సంపదలు నశించిపోయినా విద్య మనిషికి జీవనాధారంగా ఉంటుంది.  విద్య కోరినదానిని ప్రసాదించగల కామధేనువు.  విరహములో (స్వజనానికి స్వదేశానికి ఎంత దూరంలో ఉన్నా) ఆనందాన్ని కలిగించేది విద్య.  ఈ విద్య మనిషికి మూడవ కన్ను.  ఈ విద్య మనిషిని సత్కారానికి (గౌరవానికి) అర్హుడిగా మారుస్తుంది.  ఈ విద్య వలన ఆ విద్యావంతుని కుటుంబానికి కూడా ఔన్నత్యం కలుగుతుంది.  విద్య అనేది ధగ ధగా మెరిసే రత్నాలు లేకున్నా మనిషికి ఆభరణం వంటిది.  కాబట్టి, మిగిలిన అన్ని విషయాలను ఉపేక్షించి, మొదట విద్యపై అధికారం సంపాదించు.  

సేకరణ, భావ రచన:  
శ్రీనివాసకృష్ణ,  శ్రీచైతన్య విద్యాసంస్థలు

మిత్రులకు వినయపూర్వకమైన విన్నపం - 
ఈ బ్లాగులో తెలుగు లిపిలో టైపు చేయడంలో ఉన్న పరిమితుల వలన "సంశయోచ్చేది" మరియు "ప్రచ్చన్న" వంటి పదాలలో ఉండవలసిన వత్తులు వ్రాయడం నాకు సాధ్యం కాలేదు.  అలాగే శ్లోకపాదాల చివర్లలో మకారహలంతం ఎలా వ్రాయాలో (టైపు చేయాలో) తెలియక అనుస్వారం ఉంచడం జరిగింది.  అల్లాగే మొదటి శ్లోకంలోనే కోపి అనే అక్షరాల మధ్యలోను, శుకోప్యశనమాప్నోతి వంటి పదాల మధ్యలోను అకారప్రశ్లేషను ఉంచాలి.  అదెలా చేయడమో తేలియదు,  ఈ పరిమితులను అధిగమించడం ఎలాగో మిత్రులకు ఎవరికైనా తెలిసి ఉంటే, దయచేసి వారు నాకు తెలియజేయవలసిందిగా ప్రార్థన.  అలా తెలియజేస్తే, ఇటువంటి లేఖనదోషాలు తొలగించి, ఇకపై ఇటువంటివి రాకుండా జాగ్రత్త పడుతూ భవిష్యత్తులో నిర్దుష్టంగా వ్రాసేందుకు ప్రయత్నిస్తాను.  

ధన్యవాదాలతో..  మీ శ్రీనివాసకృష్ణ. 
ఈ మెయిల్:  
apsla.visakha@gmail.com లేదా srinivasakrishna1@gmail.com